మండవల్లి: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ప్రస్తుతం విద్యార్థులెవరూ లేకపోవడంతో హాస్టల్ వెలవెలబోతోంది. ఈ హాస్టల్ సమీపంలో రైల్వే ట్రాక్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్యార్థులు హైస్కూల్కు వెళ్లాలన్నా, తిరిగి హాస్టల్కు రావాలన్నా రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోంది. అలాగే రైల్వే ట్రాక్ వెంబడే నడవాల్సి వస్తుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పిల్లలను ఈ హాస్టల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. గతంలో ఈ వసతి గృహంలో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం ఈ హాస్టల్కు ఇన్ఛార్జ్ మేట్రన్గా రాధ వ్యవహరిస్తుండగా, వర్కర్గా సుస్మిత విధులు నిర్వహిస్తూ హాస్టల్ను శుభ్రం చేస్తున్నారు. విద్యార్థులను చేర్పించేందుకు తాము నందిగామలంక, పెనుమాకలంక తదితర గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసినప్పటికీ, హాస్టల్లో ఒక్కరు కూడా చేరలేదని మేట్రన్ రాధ తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఈ హాస్టల్ను గ్రామంలోని ఏదైనా అద్దె భవనంలోకి మార్చితే విద్యార్థులు చేరే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వసతి గృహాన్ని తక్షణమే గ్రామంలోకి మార్చాలని పలువురు కోరుతున్నారు.


