నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీలోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ (ఎంఎంఈ) విభాగ విద్యార్థుల కోసం ‘మెటా గేట్’ కోచింగ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక గేట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించడమే లక్ష్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ ద్వారా ఆర్జీయూకేటీ పరిపాలనా విభాగం దీనిని చేపట్టింది. గేట్ మెటలర్జీ అకడమిక్ హెడ్ శుభ్రదీప్ పాల్ హాజరై, గేట్ పరీక్ష ద్వారా లభించే ఉన్నత విద్యా, పరిశోధనా అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణ రావు, రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తదితర అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
పీయూసీ విద్యార్థుల కోసం ఒప్పందం
పీయూసీ విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ప్రారంభ దశలోనే సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వీలుగా ‘మెటాగేట్ బ్రిడ్జ్ కోర్స్’ నిర్వహణ కొరకు సదరు సంస్థతో విశ్వవిద్యాలయం రెండో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సెంట్రల్ అకడమిక్ డీన్ దువ్వూరి శ్రావణి, ఈఐటీపీ డీన్ శ్యామ్, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జున దేవి, ఎంఎంఈ హెచ్ఓడీ వీరశ్రీను, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
భీమవరం: బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ చెప్పారు. రాయలం గ్రామానికి చెందిన బాలిక (5) ఇంటికి బావ వరస అయ్యే కె మణికంఠవర్మ (21) తన తల్లితో కలసి ఈనెల 8వ తేదీన వచ్చారు. బాలిక తన చెల్లితో కలసి ఆడుకుంటుండగా నిందితుడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలం శుక్రవారం రూ.8.10 లక్షలకు ఖరారైన సంగతి తెలిసిందే. ఆ ధర కన్నా ఎక్కువ ధరకు పాట పాడతానని, మళ్లీ వేలం నిర్వహించాలని కోరుతూ శనివారం శిరిగినీడి వెంకటేశ్వరరావు రూ.4.05 లక్షలు చెల్లించారు. దీనిపై ఈ నెల 16న మళ్లీ టెండర్లు పిలిచి ఫెర్రీ వేలం నిర్వహిస్తామని గ్రామ కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ తెలిపారు.


