భీమవరం: బాండ్ ఉల్లంఘించిన రౌడీషీటర్ జెట్టి వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ రూ.లక్ష జరిమానా విధించినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. శనివారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. వెంకటేశ్వరరావుపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఉన్న కేసులకుగాను నిందితుడ్ని ఇటీవల భీమవరం మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశిస్తూ రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బైండోవర్ చేశారు. అయితే బైండోవర్ కాలం అమలులో ఉండగానే నిందితుడు గత నెల 18వ తేదీన సుంకర పద్దయ్యగారి వీధిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్కు నివేదిక పంపారు. దీంతో బాండ్ ఉల్లంఘన విచారణ నిర్వహించి, రూ.5 లక్షల బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తూ ఏడు రోజుల్లో చెల్లించాలని నిందితుడు వెంకటేశ్వరరావును ఆదేశించారన్నారు. అయితే నిందితుడి వినతితో బాండ్ ఉల్లంఘన మొత్తాన్ని రూ.లక్షకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో సీఐ ఎ రమేష్ పాల్గొన్నారు.


