పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి బెంగళూరుకు ప్రయాణించే వారికి కోసం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. గతంలో స్పెషల్ ట్రైన్గా ఉన్న ఈ రైలు, ఇకపై రెగ్యులర్ రైలుగా అందుబాటులో ఉంటుందని, దీనివల్ల ప్రయాణ చార్జీలు సుమారు 30 శాతం తగ్గుతాయని మంత్రి తెలిపారు. రైలు 17293 నెంబరుతో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 17294 నెంబరుతో ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:50 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. పాలకొల్లు, ఆకివీడు, భీమవరం స్టేషన్లలో రూ. 20 కోట్లతో గూడ్స్ షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
నరసాపురం: వైఎన్ కళాశాల హెచ్ఆర్డీ సెంటర్, ఏపీఎస్ఎస్డీసీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్మేళా నిర్వహించారు. పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి మొత్తం 511 మంది హాజరు కాగా, 210 మందికి ఉద్యోగాలు లభించాయని కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ కనకారావు చెప్పారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.


