దెందులూరు: కుమార్తె మరణంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దెందులూరు ఎస్సై డి వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ఇవి. కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి శ్రీనివాసరావు (52) ఈ నెల 8న పొలంలో నీరసంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. కుమార్తె మరణంతో మనోవేదన గురై పురుగులమందు తాగినట్లు చెప్పడంతో అర్ధరాత్రి ఏలూరు ఆశ్రమం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలు చేసి డీజీపీ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి శేషవస్త్రం, ప్రసాదం ఫొటో అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.


