వీరవాసరం: మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆక్వా రంగ పురోభివృద్ధికి సిబ్బంది, రైతులు కలిసికట్టుగా పాటుపడాలని జిల్లా మత్స్య శాఖ అధికారి (డీఎఫ్ఓ) శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశాల మేరకు వీరవాసరం, పెనుమంట్ర, అత్తిలి, ఇరగవరం, పాలకోడేరు మండలాల ఆక్వా రైతులకు మంగళవారం వీరవాసరంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ.. ఆక్వాకల్చర్ రంగంలో నమోదు ప్రక్రియలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఎంపెడా చెరువుల ఎన్రోల్మెంట్స్, పోస్ట్ హార్వెస్ట్ టెస్ట్ సర్టిఫికెట్, ఎగుమతుల ప్రక్రియ (ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్) తదితర అంశాలపై ఆయన రైతులకు వివరించారు. రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి.రామ్మోహనరావు మాట్లాడుతూ.. రొయ్యలకు వచ్చే వైట్ సిండ్రోమ్, వివిధ వైరస్ వ్యాధులపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎంపెడా డీడీ గోపాల్ ఆనంద్, ఉండి రిసోర్స్ సెంటర్ హెడ్ చంద్రశేఖర్, ఎఫ్డీఓ సతీష్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, గౌరిప్రియ, భోగిరెడ్డి శ్రీనివాస్, గంధం కేసుబాబు, యరకరాజు గోపాలకృష్ణరాజు, మళ్ల ప్రకాష్, మళ్ల శ్రీరామ్మూర్తి, తాడాల ప్రసాద్లతో పాటు రొయ్యల రైతులు పాల్గొన్నారు.


