భీమవరం: ప్రజా, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్లను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను నిరసిస్తూ మంగళవారం భీమవరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ వెండర్లు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరి మధు, భీమవరం లేఖర్ల అసోసియేషన్ కార్యదర్శి కవురు పృథ్వీశంకర్ మాట్లాడుతూ.. 396 జీవో వల్ల ప్రజల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని, దీనివల్ల ఆస్తులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది దస్తావేజు లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న దస్తావేజు లేఖరుల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని, కాబట్టి ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియనే యథావిధిగా కొనసాగించాలని వారు కోరారు. 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రెండు రోజుల పాటు పెన్డౌన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి గుండు హరిబాబు, గండ్రెడ్డి మధు, వీరగొట్టపు అప్పారావు, రాపాక శ్యామల ప్రసాద్, పామర్తి మహేష్, మేకా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


