పోలవరం రూరల్ 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రూ.990 కోట్లతో 440 రోజుల్లోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించిందని మంత్రి చెప్పారు. ఏడాది కాలంలో గ్యాప్–1 పనులు 48 శాతం, గ్యాప్–2 పనులు 29 శాతం పూర్తయ్యాయని, 2027 నాటికి ఈసిఆర్ఎఫ్ డ్యాం పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన కాలువలను అనుసంధానించే 4 టన్నెల్స్ మరో 10 రోజుల్లో పూర్తవుతాయన్నారు. కేంద్రం రూ.8,323 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిందని దీంతో పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణ సాయాన్ని రూ.3.5 లక్షలకు, ఇంటి స్థలం మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని, జూలైలో సీఎం పర్యటన సందర్భంగా రూ.200 కోట్ల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. 2027 నాటికి తొలిదశ ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని ఐకానిక్ బ్రిడ్జిలు, రిసార్ట్స్తో టూరిజం హబ్గా మారుస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ వి.అభిషేక్, ఈఎన్సీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


