ద్వారకాతిరుమల: క్షేత్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన మాంసం దుకాణాల కారణంగా భక్తులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో సోమవారం ‘క్షేత్రంలో రోడ్డుపక్కన మళ్లీ మాంసం దుకాణాలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. రోడ్డుపక్కన ఉన్న దుకాణాలను సిబ్బందితో తొలగింపజేశారు. మళ్లీ రోడ్డు పక్కన మాంసం దుకాణాలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని పంచాయతీ కార్యదర్శి జీటీవీ శ్రీనివాస్ వ్యాపారులను హెచ్చరించారు.
సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు
తణుకు అర్బన్: విద్యుత్ స్మార్ట్ మీటరు ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది నా తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దువ్వ గ్రామానికి చెందిన సిర్రా రమేష్ సోమవారం తణుకు తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. గతనెల 20వ తేదీన తాము వద్దని చెప్పినా తమ అనుమతి లేకుండా విద్యుత్ స్మార్ట్ మీటరును విద్యుత్ శాఖ లైన్మెన్ అజకర్ ఏర్పాటుచేశారని, తమ అనుమతి లేకుండా ఎలా బిగించారని నిలదీసిన క్రమంలో తన తల్లి రత్నకుమారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్న అంగీకార పత్రాన్ని చూపించారని ఆరోపించారు. ప్రతినెలా రూ.వెయ్యి నుంచి రూ.1,500 లోపు వచ్చే బిల్లు స్మార్ట్ మీటరు కారణంగా రూ. 14,539 వచ్చిందని చెప్పారు. ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


