భీమవరం: భీమవరం పట్టణం పెదపేట కల్కి బజారులో ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా అల్లమ్గడ్ గ్రామానికి చెందిన ప్రదీప్ సబర్ పెదపేటలో అద్దె ఇంటిలో ఉంటూ మేసీ్త్ర సహాయకుడిగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన కడుపు నొప్పిని తట్టుకోలేక శుక్రవారం రాత్రి నివాసముంటున్న గదిలోని బాత్రూమ్లో ఇనుప రాడుకు టవల్తో ఉరివేసుకుని మృతి చెందాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముదినేపల్లి(కై కలూరు): పేకాట జూదరులపై కఠినంగా వ్యవహరిస్తామని ముదినేపల్లి ఎస్ఐ వీరభ్రదరావు హెచ్చరించారు. చిగురుకోట శివారు అయ్యవారిరుద్రవరం రోడ్లో పేకాట జరుగుతుందనే సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.9,400 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యక్రమాలపై పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.
పెనుమంట్ర: ఆలమూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాల భక్తులు శ్రీ పోలేరమ్మ దేవతగా ఆరాధించే వేపచెట్టు శనివారం మధ్యాహ్నం ఈదురుగాలితో కూడిన కొద్దిపాటి వర్షానికి నేలకొరిగింది. ఈ చెట్టు స్థానికంగా విశేష గుర్తింపు పొందడంతో దానిని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరచూ వచ్చేవారు. చెట్టు రహదారిపై పడిపోవడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.
ఆకివీడు: స్థానిక బైపాస్ రోడ్డులో బియ్యం లోడు ట్రాక్టర్ శనివారం తిరగబడింది. పీడీఎస్ బియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ తిరగబడటంతో ట్రక్కులోని బియ్యం బస్తాలు కిందపడ్డాయి. సంబంధిత రైస్మిల్లర్ బియ్యం బస్తాల్ని మరో లారీలోకి లోడు చేయించారు. ట్రాక్టర్ డ్రైవర్కు ఏవిధమైన గాయాలు కాలేదు. గత మూడు నెలల నుంచి లారీలు, ట్రాక్టర్లు, ఇతర లోడు వాహనాల్ని బైపాస్ రోడ్డు నుంచి అయిభీమవరం రోడ్డు మీదుగా ఆకివీడులోని జాతీయరహదారి వెంట మళ్లించారు. కొన్ని రోజులకే బైపాస్ రోడ్డు దెబ్బతింది. గుంతలుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేసేవరకూ ట్రాఫిక్ను మళ్లింపును పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.


