ఏలూరు (టూటౌన్): దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణం అవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాకారుల డప్పు దరువులు, నృత్యాలతో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. జ్యూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. వీజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. 30 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి రాయితీ అందడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో సాగునీటపాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో పారుతుందని చెప్పారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బి.బలరాం, అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నాయకులు వై.కేశవరావు, పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్


