తణుకు అర్బన్: తణుకులో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ దాడుల్లో తణుకు, పైడిపర్రులోని 4 రేషన్ డిపోల్లో అవకతవకలను గుర్తించి బాధ్యులపై 6 ఏ కేసులు నమోదుచేశారు. గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో తణుకు వీరభద్రపురం పరిధిలోని 35వ నంబరు గాడెల్లి అనూష పేరుమీద ఉన్న డిపోలో బియ్యం 9210 కేజీలు ఉండాల్సి ఉండగా 760 కిలోలు, పంచదార 6 కిలోలు తక్కువగా ఉన్నాయని, పైడిపర్రు మండపాక రోడ్డులోని 49వ నంబరు దిడ్ల శ్రీనివాస్ పేరుమీద ఉన్న రేషన్ డిపోలో 3335 కిలోలు బియ్యం ఉండాల్సి ఉండగా 865 కిలోలు, పంచదార 18.50 కిలోలు ఎక్కువ ఉన్నాయని సీఎస్డీటీ ఇన్చార్జి ఎన్.శ్రీదేవి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ఇరగవరం కాలనీలో 21వ నంబరు ముఖమట్ల ఉమాదేవి పేరుతో ఉన్న రేషన్ డిపోలో 9690 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా 8790 కిలోలు తక్కువ, పంచదార 7.50 కిలోలు ఎక్కువ ఉందని, ఎన్టీఆర్ పార్కు ప్రాంతంలోని 12వ నంబరు పూడి లక్ష్మి పేరుతో ఉన్న రేషన్ డిపోలో 10580 కిలోలు బియ్యం ఉండాల్సి ఉండగా 1880 కిలోలు తక్కువ ఉందని, పంచదార 3.50 కిలోలు ఎక్కువ ఉందని చెప్పారు. అత్యధికంగా 21వ నంబరుతో ఉన్న ముఖమట్ల ఉమాదేవి రేషన్ డిపోలో ఏకంగా 8790 కిలోల బియ్యం తక్కువగా ఉండడం, మూడు రోజుల వ్యవధిలోనే ఇంతటి తేడా రావడం సంచలనంగా మారింది. వచ్చిన బియ్యాన్ని నేరుగానే బ్లాక్ మార్కెట్కు తరలించే శారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 1న మాత్రమే దుకాణం తెరిచారని, 2న దుకాణం తెరవలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడుల్లో సీఐలు డి.ప్రసాద్కుమార్, డి.గంగాభవాని, విజిలెన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ జి.మీరయ్య తదితరులు పాల్గొన్నారు.


