వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి
● రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటున్న డాక్టర్లు
బుట్టాయగూడెం: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ అయితే వేసవిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సున్నితంగా ఉండేవారు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎండల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనిషి శరీరంలోని అవయవాలు అలసటకు గురై క్షీణించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
వేసవిలో తీసుకోవాల్సిన పండ్లు
వేసవికాలంలో పుచ్చకాయ, ఖర్జూరం, దానిమ్మ, కమల, ద్రాక్షతో పాటు తాటిముంజులు కూడా తీసుకోవచ్చు. మసాలా లేని లేదా తక్కువ వేసిన వంటకాలు మాత్రమే తీసుకోవాలి
● సాధారణ రోజుల్లో మనిషి 2–3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. వేసవిలో 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. గుంటల్లో, చెరువుల్లో నీరు కలుషితంగా ఉంటుంది. గ్లాసుడు చల్లటి నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుకుని తాగాలి. మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు తగిన మోతాదులో కలుపుకుని తాగాలి. గంజి, పెసర కడుగులో నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగితే ఉష్ణ తాపాన్ని చల్లారుస్తుంది.
ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చల్లని పానీయాలు సేవిస్తూ ఉండాలి. అవసరమైతే తప్ప ఎండల సమయంలో బయటకు రాకపోవడం మంచిది.
డాక్టర్ ఎస్. నందిని, దొరమామిడి పీహెచ్సీ, బుట్టాయగూడెం మండలం


