ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించామని రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎన్నికల అధికారి టి.అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో అధ్యక్షుడిగా గోకరాజు ఆదిత్య, ఉపాధ్యక్షుడిగా ఎం వీరభద్రరావు, కార్యదర్శిగా వీవీఎస్ఎం శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా కె.సంజీవరావు, కోశాధికారిగా ఎస్వీ సుబ్బారావు, కౌన్సిలర్గా కె బాలజ్శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
దెందులూరు: లారీ డ్రైవర్కు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన వైనమిది. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు గ్రామానికి చెందిన ఎం.అన్నవరం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గాలాయిగూడెం మొక్కజొన్న ఫ్యాక్టరీకి లోడు లారీ తీసుకొచ్చాడు. శనివారం రాత్రి లారీ పైకెక్కి మోకు సర్దుతుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలింది. తోటి లారీ డ్రైవర్ చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తీసుకు వెళుతుండగా మధ్యలో లారీ డ్రైవర్ అన్నవరం మృతి చెందాడు. మృతుడికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావతి కళావేదికపై చిలకమర్తి కళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీల ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత, ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతాయనే కథనంతో చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం– విశాఖ వారి అగ్నిసాక్షి నాటక ప్రదర్శన సాగింది. రచన మాడభూషి దివాకర్ బాబు, దర్శకత్వం పి.బాలాజీ నాయక్ వహించారు. క్రాంతి ఆర్ట్స్ థియేటర్– నెల్లూరు వారి ఫోటో నాటిక ద్వితీయ ప్రదర్శనగా సాగింది. రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం తంబు సురేష్ బాబు వహించారు. ఎస్వీ రంగారావు కళా స్రవంతి వారి ఆచమనం నాటిక తృతీయ ప్రదర్శనగా సాగింది.
తాడేపల్లిగూడెం: మూడు రోజులపాటు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో జరిగిన 12వ అంతర్ కళాశాల పోటీలు ఆదివారం ముగిశాయి. మహిళల త్రోబాల్లో అనంతరాజుపేట, వెంకట్రామన్నగూడెం జట్లు విజేతలుగా నిలిచాయి. బాస్కెట్బాల్ పురుషుల విభాగంలో వీఆర్ గూడెం, అనంతరాజు పేట రన్నరప్గా నిలిచింది. మహిళల విభాగంలో అనంతరాజుపేట, మార్కాపురం జట్టు జయకేతనం ఎగురవేశాయి. వాలీబాల్ పురుషుల విభాగంలో పులివెందుల, అనంతరాజు పేట జట్లు విజయం సాధించాయి. మహిళల విభాగంలో అనంతరాజు పేట, పార్వతీపురం జట్లు విజేతలుగా నిలిచాయి. రిలే పురుషుల విభాగంలో అనంతపురం. మార్కాపురం జట్లు ప్రతిభ కనపర్చాయి. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల జట్టు గెలుపొందింది.


