● 16 కేజీల వెండి చీరతో అమ్మవారి దర్శనం
● 1,008 మంది ముత్తైదువులచే శోభాయాత్ర
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గ్రామ దేవత నూకాలమ్మ 62వ వార్షిక ఉగాది జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), వెంకట రామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సారథ్యంలో ఉదయం 6:45కు గరగలు తీయడంతో పాటు ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ ఆధ్వర్యంలో పలువురు దంపతులతో కలశస్థాపన చేయించడంతో జాతర వేడుక ప్రారంభమైంది.
గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్యాలయం నుంచి శ్రీ గంగానమ్మ అమ్మవారు సింహవాహనంపై 1,008 మంది ముత్తైదువులతో శోభయాత్రగా మంగళవాయిద్యాలు, బాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య సంప్రదాయ సారెను శోభాయాత్రగా నూకాలమ్మ అమ్మవారికి ఆలయానికి తీసుకువచ్చారు. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్యశర్మ(సూరిపండు, ఆలమూరు) ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చింతా నాగరాజు, కందుల సురేష్తో కూడిన ఆలయ కమిటీ సభ్యులతోపాటు వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవాప్రతినిధి ఈమని శశికుమార్, కేఎల్ఎన్ ధనకుమార్తదితరులు పాల్గొన్నారు.
సారెను వేదమంత్రాల నడుమ అందజేసి, అమ్మవార్లకు పూజ, హారతి సమర్పించారు. సుమారు 16 కేజీల వెండి చీర అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ దంపతులు, పూర్వపు మున్సిపల్ చైర్మన్ దంపతులు ఆలయ శాశ్వత చైర్మన్ దంపతులు అమ్మవారిని దర్శించారు. డాక్టర్ కొమ్మోజు వంశీ కృష్ణ దంపతులు ఈ రోజు అమ్మ వారి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వస్త్రాలంకరణ, పుష్పాలంకరణకు యర్రా ప్రసాదరెడ్డి, నాగ స్వరాజ్య లక్ష్మీ దంపతులు, అంకనబోయిన రామచంద్ర వెంకట లక్ష్మి దంపతులు సహకరించారు. సాయంత్రం ఆరుగంటలకు నాలుగు మాడవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్యబృందంచే కూచిపూడి, భరతనాట్య, జానపద, శాసీ్త్రయ నృత్యప్రదర్శన జరిగింది.


