వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత
ఇరగవరం: రేలంగికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దిరిశిపో రాజేష్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కారుమూరి కమిటీలను నియమించారు. పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీనిని బలంగా తీసుకువెళ్లాలన్నారు. కేసులు, దాడులతో ప్రతిపక్ష పార్టీ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మనోధైర్యంతో ముందుకు సాగుదామన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ లేదని సీబీఐ రిపోర్టు ఇవ్వగా, దానిని పక్కదారి పట్టించేలా కూటమి నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీదే అధికారం అని కారుమూరి అన్నారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పులుపు అనిల్, రాష్ట్ర ఎగ్జిక్యూటి మెంబర్ పెన్మెత్స సుబ్బరాజు, మండల ఎస్సీ సెల్ నాయకులు తాతపూడి బోస్, ఉప సర్పంచ్ పులుపు అక్కమాంబ, మండల అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, వడ్డే మార్కండేయులు, మెట్ల కిరణ్మయి మైనం పాము, తణుకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మోహర్ అన్సారీ, నియోకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.


