
ప్రియుడితో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ఓ వివాహిత నిద్రిస్తున్న భర్తను చాకుతో మెడపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేయించింది.
ఏలూరు టౌన్ : ప్రియుడితో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ఓ వివాహిత నిద్రిస్తున్న భర్తను చాకుతో మెడపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేయించింది. ఈ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటలలోపే ఛేదించి నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మేరకు శనివారం ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామానికి చెందిన కురిపాటి చంద్రశేఖర్కు 11 ఏళ్ల క్రితం భువనేశ్వరితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఉంగుటూరు మండలం నారాయణపురం వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ నారాయణపురం టైల్స్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
తాడేపల్లిగూడెం కోతిబోమ్మసెంటర్ ప్రాంతానికి చెందిన గొర్ల సూర్యనారాయణ వీరు నివాసం ఉంటున్న ఇంటిపక్కన తాపీ పని నిమిత్తం వచ్చాడు. భువనేశ్వరికి తాపీ పనిచేస్తున్న గొర్ల సూర్యనారాయణతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. వీరి విషయం భర్త చంద్రశేఖర్కు తెలియడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు హత్యకు పథక రచన చేశారు. సూర్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఒక చాకును కొనుగోలు చేసి స్కూటీలో పెట్టుకుని, భువనేశ్వరి ఇంటికి వచ్చాడు.
ఈనెల 3వ తేదీ రాత్రి చంద్రశేఖర్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో భువనేశ్వరి, సూర్యనారాయణ చాకుతో దాడి చేశారు. పీక, మెడమీద విచక్షణారహితంగా పొడవటంతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఇంటిలోనే నిద్రిస్త్తున్న పిల్లలను వదిలేసి భువనేశ్వరి, సూర్యనారాయణ స్కూటీపై పరారయ్యారు.
ఈ హత్య కేసును క్రైమ్ నెంబర్ 168/2023 యూ/ఎస్ 302, 449, 120(బీ), రెడ్విత్ 34 ఐపీసీగా నమోదు చేశారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, చేబ్రోలు ఎస్సై కె.స్వామి, నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను దర్యాప్తు చేపట్టారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఉంచారు. హత్య కేసును చేధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు.