హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం అమ్మవారిని ఉగ్రప్రభ, త్వరితా క్రమాల్లో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని ఉగ్రప్రభ క్రమంలో, షోడశీక్రమంలో బోగభేరాన్ని త్వరితాక్రమంలో అలంకరించి చతుఃస్థానార్చన పూజలు జరిపారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.
ఖాళీ సీట్ల భర్తీకి
స్పాట్ అడ్మిషన్లు
న్యూశాయంపేట: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన గిరిజన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డీఎస్ వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్లోని గిరిజన సంక్షేమ (బాలుర) పాఠశాల, నర్సంపేటలోని గిరిజన (బాలుర) పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27న ఉదయం 10 గంటలకు సరైన ధ్రువపత్రాలతో వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద యాకుత్పురాలోని బాలుర పాఠశాలలో కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన కోరారు.
సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈ నెల 25న నిర్వహించాల్సిన ఫార్మ్డీ మూడో సంవత్సరం పరీక్షలు, ఈనెల 24న జరగాల్సిన ఫార్మ్ డీ నాలుగో సంవత్సరం పరీక్షలు, ఎంఈడీ నాలుగో సెమిస్టర్, ఈనెల 25న జరగాల్సి న బీటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు, బీఫార్మసీ ఆరో సెమిస్టర్, బీఫార్మసీ నాన్సీబీసీఎస్ మూడో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు.
నేడు కాజీపేట మీదుగా వన్వే స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం గురువారం యశ్వంత్పూర్–కోటా వయా కాచిగూడ మీదుగా నడిపిస్తున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు.గురువారం యశ్వంత్పూర్–కోటా (06591) వెళ్లే వన్వే స్పెషల్ ట్రైన్ కాజీపేట జంక్షన్ చేరుకొని వెళ్తుంది. ఈ స్పెషల్ ట్రైన్కు ఝెలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, షీహోర్, సుజల్పూర్, బెర్చా, ఉజ్జయిని, నాగ్డా, విక్రమ్ఘర్, ఆలోట్, చామహాల, షామ్ఘర్, భవానీ మండిలో హాల్టింగ్ కల్పించారు.
ఖేలో ఇండియా
క్రీడావేదికల పరిశీలన
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–26 ఏర్పాట్లలో భాగంగా హనుమకొండలో ప్రతిపాదిత ఖోఖో, జూడో క్రీడా వేదికలను ఖేలో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు బుధవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా బృందం పర్యటనకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, పోటీల నిర్వహణకు అవసరమైన సాంకేతిక అంశాలు, ఆటగాళ్ల వసతి, రవాణా, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని హనుమకొండ యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్కు సూచించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, సంబంధిత క్రీడా అధికారులు, సిబ్బంది పాల్గొని హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఖోఖో, జూడో పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు వివరించారు. ఖేలో ఇండియా యూత్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అన్ని జిల్లాలతో సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు.


