నల్లబెల్లి: ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీపీఐ జిల్లా శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. నేటి రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడే పార్టీలు యాక్టివ్గా ఉంటున్నాయని, అధికారం కోల్పోగానే పార్టీల్లోని నాయకులు ఇతర పార్టీల వైపు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా పేదల కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలేనని కొనియాడారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే తమ పార్టీ సిద్ధాంతమని, వందేళ్ల సుదీర్ఘ చరిత్రలో పార్టీ నిరూపించిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని పార్టీలు స్వప్రయోజనాల కోసం పనిచేస్తే.. కమ్యూనిస్టులు పేదల కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి వెనుకాడరని స్పష్టం చేశారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే బాషామియా, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు చింతకింది కుమారస్వామి, నాయకులు పంజాల రమేశ్, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, గుండె బద్రి, అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, బట్టు సాంబయ్య. మామిండ్ల పెద్ద ఐలయ్య, పరికి కొర్నేల్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు


