నిల్వ వివరాలను నమోదు చేయాలి : డీఏఓ | - | Sakshi
Sakshi News home page

నిల్వ వివరాలను నమోదు చేయాలి : డీఏఓ

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పారిశ్రామిక శిక్షణ

నర్సంపేట రూరల్‌: పురుగుల, ఎరువుల, విత్తనాల షాపుల యజమానులు, డీలర్లు ప్రతిరోజు షాపుల్లో ఉన్న నిల్వ వివరాలను స్టాక్‌ బోర్డుపై నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. నర్సంపేట డివిజన్‌స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం పట్టణంలోని రైతువేదికలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు స్టాక్‌బోర్డును రెగ్యులర్‌గా అప్‌డేట్‌ చేయాలని, వరి సన్న విత్తనాల రకాల వివరాలను నమోదు చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. విత్తనాలు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు రైతులకు అందించాలని, రైతులకు కోరిన విత్తనాలను మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ సంచాలకులు బొమ్మెన శ్రీనివాస్‌, టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, మండల వ్యవసాయాధికారులు కృష్ణకుమార్‌, గోపాల్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్‌, రజిత, శ్యాం, డీలర్లు పాల్గొన్నారు.

టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

కాళోజీ సెంటర్‌: జిల్లాలో టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయని డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. మొదటి రోజు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు 64 మంది విద్యార్థులకు 50 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు.

దరఖాస్తులు సమర్పించాలి

న్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎ.పుష్పలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీసీహాస్టల్స్‌.సీజీజీజీ.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం వసతి గృహాల సంక్షేమాధికారులను లేదా హనుమకొండ లష్కర్‌బజార్‌లోని బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.

ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ధర్మరాజు

కాశిబుగ్గ: వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జీఎస్‌కే ధర్మరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేసి, పదోన్నతిపై సూపరింటెండెంట్‌గా వరంగల్‌కు వచ్చారు. ఇంతవరకు ఆస్పత్రి ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్‌ హరికిషన్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. కాగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ధర్మరాజుకు పలువురు వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్‌ అర్బన్‌ : ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్‌ హాల్‌లో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ), మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ప్రతిరోజూ 120 మంది సభ్యులు పాల్గొననున్నారు. మొదటిరోజు శిక్షణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో వ్యాపార అవకాశాలు, వ్యాపార నిర్వహణలో మెలకువలు, ఉత్పత్తుల మార్కెటింగ్‌, ఆర్థిక నిర్వహణ, వ్యాపార విస్తరణ వంటి అంశాలపై బల్దియా డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్య, మెప్మా ప్రతినిధులు అవగాహన కల్పించారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదిత శిక్షణ భాగస్వామ్య సంస్థకు చెందిన నిపుణుడు మోహన్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సందీప్‌ కుమార్‌, శ్రీలత, మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ రమేష్‌, సీఓలు రమ, రజిత, శ్రీలత, రాజ్‌కుమార్‌, ఖలీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement