వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండడం, వాహనాలు, పారిశ్రామిక ప్రాంతాలనుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. దీనివల్ల వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీన్ని నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చర్యలు చేపట్టడం ద్వారా రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు నర్సింహారావు, నాగయ్య, అంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీధర్తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


