● రంగాపురంలో రూ.2 లక్షల ఆస్తినష్టం
నల్లబెల్లి: రంగాపురంలో గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం ఓ రైతు కుటుంబాన్ని వీధిన పడేసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మీరాల పెద్ద సమ్మయ్య తన రేకుల ఇంట్లో ఉన్నాడు. షార్ట్ సర్క్యూట్తో నిప్పు రవ్వలు పత్తిపై పడి మంటలు వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద సమ్మయ్య ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. క్షణాల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 7 క్వింటాళ్ల పత్తి, బియ్యం, కట్టుబట్టలు, వంట సామగ్రి, ఇతర గృహోపకరణాలు, రూ.80 వేల నగదు, బ్యాంకు పత్రాలు, గుర్తింపు కార్డులు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు పంచాయతీ కార్యదర్శి రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.


