అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

హన్మకొండ అర్బన్‌: అర్హులంరికీ సంక్షేమ ఫలాలు అందించమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం హనుమకొండలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీస్‌ సిబ్బందికి సేవా పతకాలు, ప్రశంసపత్రాలు అందించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

రోడ్లు, ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం

రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం కొనసాగుతోందన్నారు. హనుమకొండ–కాజీపేట రహదారిపై రూ.78 కోట తో, ఫాతిమా–మామునూరు మార్గంలో రూ.68 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. రవాణా సౌకర్యాల మె రుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణం, భద్రకాళి చెరువు పూడికతీత పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. కాకతీయ మ్యూ జికల్‌ గార్డెన్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పాత కలెక్టరేట్‌ బంగ్లాను ఆధునికీకరించి వారసత్వ కట్టడంగా పరిరక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోందన్నారు. జిల్లాకు రెండు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం

జిల్లాలో 771 చెరువుల్లో కోటికి పైగా.. చేపపిల్లలను ఉచితంగా వదిలామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్‌ పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. వన మహోత్సవంలో 25 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించామని వెల్లడించారు. ధరణి సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత, గిగ్‌ వర్కర్ల సంక్షేమం, పేదలకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు అదాలత్‌ సర్కిల్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో ముందంజ

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్‌, గృహలక్ష్మి కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపారు.

మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో పోలీస్‌ పరేడ్‌ను పరిశీలిస్తున్న మంత్రి, వేడుకలకు హాజరైన అధికారులు, నాయకులు

గ్రేటర్‌ నగరాభివృద్ధికి

రూ.5 వేల కోట్లు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,

సమాచార, పౌర సంబంధాల శాఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

జంట నగరాల అభివృద్ధికి ప్రణాళిక

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హనుమకొండ జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. హనుమకొండ–వరంగల్‌ జంట నగరాల అభివృద్ధికి దాదాపు రూ.5 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 2040 వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నట్లు, 2057 జనాభా అంచనాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement