హనుమకొండ కలెక్టర్, బల్దియా
ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్
వరంగల్ అర్బన్: ప్రభుత్వ సహకారంతో వరంగల్ మహానగరం సమగ్రాభివృద్ధి చెందుతుందని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధికి విడుదల చేసిన నిధులు, జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ ఇసంపల్లి జోనా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, అకౌంట్స్ ఆఫీసర్ శివలింగం, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్లస్టర్లుగా గ్రామసభలు
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ జిల్లాలో ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ సభలు, గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ‘పంట అవశేషాలను కాల్చొద్దు.. పర్యావరణాన్ని కాపాడండి’ అంశంతో రూపొందించిన వాల్పోస్టర్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీసీపీ దార కవిత, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర పాల్గొన్నారు. వరంగల్ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్ అధికారులు పాల్గొన్నారు.


