కాజీపేట అర్బన్: ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. హంటర్రోడ్డులోని లయన్స్క్లబ్ హాల్లో పొన్నం మొగిలి అధ్యక్షతన ముదిరాజ్ సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మానంతో పాటు ఉగాది డైరీని ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండా ప్రకాశ్ హాజరై మాట్లాడుతూ ముదిరాజ్లు పదవులు వదులుకోవద్దని సూచించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ద్వారానే హైదరాబాద్లో ముదిరాజ్ల ఆత్మగౌరవ భవనానికి స్థలం, నిధులు మంజూరు చేయించామన్నారు. బీసీ–డీ నుంచి బీసీ–ఏలో చేర్చాలనే పోరాటంలో ముది రాజ్లు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వెంకటనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ శానబోయిన రాజ్కుమార్, జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, నాయకులు సోమయ్య, బుస్సా మల్లేశం, బయ్య స్వామి, పులి రజినీకాంత్, పోలు అయర్ చంద్, గోనెల పద్మ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ బండా ప్రకాశ్


