కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో యాసంగి వరి ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత సకాలంలో డబ్బులు అందేలా చూడాలని, గన్నీ సంచుల కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోలు శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సమన్వయంతో పని చేసి రైతులకు ముందుగానే టోకెన్ విధానంలో సమాచారం ఇవ్వాలని తెలిపారు. రైతుల ఆధార్ నంబర్ ఆధారంగా ధాన్యం వివరాలు, వాహన నంబర్, సాగు విస్తీర్ణం వంటి సమాచారాన్ని క్షుణ్ణంగా నమోదు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ శ్రీను, పౌరసరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మండలానికో బస్సు
హసన్పర్తి: గ్రామైక్య సంఘాల ద్వారా జిల్లాలోని 12 మండలాల్లో 12 బస్సులు కొన్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హసన్పర్తి మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్లో కాకతీయ మహిళా సమైక్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బస్సుల కొనుగోలు వల్ల ఒక్కో సంఘానికి నెలకు రూ.70 వేలు ఆదాయం సమకూరుతోందన్నారు. కాకతీయ మహిళా సమాఖ్యల్లో 1,16,576 మంది సభ్యులుు. రూ.460 కోట్లు లింకేజీ రుణాలు పొందడం హర్షనీయమన్నారు. ఈసందర్భంగా సంస్కృతి విహార్లో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, తహసీల్దార్ కిరణ్కుమార్, జిల్లా మహిళా సమాక్య అధ్యక్షురాలు సుమలత, కార్యదర్శి సుజాత, వివిధ గ్రామైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


