● గుండెలను పిండేసిన చిన్నారుల రోదన
● మామ, భార్యను హతమార్చిన కిరాతకుడు
కాజీపేట అర్బన్: ‘మమ్మీ ఎక్కడుంది. మమ్మీ కావాలి. డాడీ ఎక్కడున్నావు..’ అంటూ ఏడాదిన్నర బాలుడు జయాంశ్ బుజ్జి పలుకులకు కడిపికొండ రాజీవ్ గృహ కల్ప కంటతడి పెట్టింది. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహ కల్ప సముదాయంలో పొక్కుల ప్రవీణ్ తన భార్య రాజశ్రీ(24), మామ భాషబోయిన రాజశేఖర్(51)ను సుత్తితో తలపై మోది, ఒంటిపై డీజిల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో మునిగి ఉండగా రాజశేఖర్, రాజశ్రీ కాలి బూడిదయ్యారు. కాలి బూడిదైన రాజశ్రీ, పరారైన తండ్రి ప్రవీణ్ ఇద్దరూ కనపడకపోవడంతో జయాంశ్, ఆరు నెలల దివాంశిక వెక్కివెక్కి ఏడ్చారు. ఈ పిల్లలకు అండగా నిలిచేదెవరు దేవుడా.. ఎందుకు వీరి జీవితాలను ఇలా రాశావు అంటూ కాలనీవాసులు కన్నీరుమున్నీరయ్యారు.
ఛేదించిన మడికొండ పోలీసులు, క్లూస్, ఫోరెన్సిక్ టీం
మామ రాజశేఖర్, భార్య రాజశ్రీని హత్య చేసి తనకు ఏం తెలియదన్నట్లుగా బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుదోవ పట్టిద్దామనుకుని స్కెచ్ వేశాడు నిందితుడు పొక్కుల ప్రవీణ్. కాగా, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ ఘటనా స్థలికి తెల్లవారుజామునే చేరుకుని క్లూస్, ఫోరెన్సిక్ టీం సారథ్యంలో ఘటనకు బాధ్యుడు ప్రవీణ్ అనే విషయాన్ని చేధించారు. మృతురాలి సోదరి తేజస్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.


