ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 15 2026 4:51 AM | Updated on Mar 15 2026 4:51 AM

– 8లోu గంగా జమునా తహజీబ్‌కు ప్రతీక..

న్యూస్‌రీల్‌

కాంతులీనే విద్యుద్దీపాలు.. నోరూరించే హలీం, హరీస్‌, బిర్యానీ సువాసనలు. మంత్రముగ్ధుల్ని చేస్తూ విక్రయానికి సిద్ధంగా ఉన్న వస్త్రాభరణాలు. సుగంధాలు వెదజల్లే అత్తరు సీసాలు. ఇలా ఒక్కటేమిటి త్రినగరిలో మండి బజార్‌ వెళ్తే అది ఓ మధుర జ్ఞాపకం. రంజాన్‌ సందర్భంగా ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. వరంగల్‌ పాత లక్ష్మీటాకీస్‌ మొదలు, పోచమ్మమైదాన్‌ వరకు, అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌, చార్‌బౌళి ప్రాంతంలో రంగుల విద్యుత్‌ దీపాలు ఆకర్షిస్తుంటాయి. సిటీ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా మారిన మండిబజార్‌పై రంజాన్‌ నేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.. – న్యూశాయంపేట

చిరు వ్యాపారులకు జీవనోపాధి..

రంజాన్‌ మాసంలో చిరువ్యాపారులకు పుష్కలంగా జీవనోపాధి దొరుకుతుంది. ఒక్క నెలలోనే జరిగే వ్యాపారంపై వందలాది కుటుంబాలు ఏడాదిపొడవునా ఆధారపడతాయి. తోపుడు బండ్ల మీద అమ్మే వస్తువుల నుంచి షోరూంల వరకు ప్రతీ ఒక్కరికి ఇది మెయిన్‌ సీజన్‌. అదనపు రద్దీని తట్టుకోవడానికి హోటళ్లు, బట్టల షాపుల్లో తాత్కాలికంగా వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది.

కులమతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ ఉత్సవం గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తోంది. మండిబజార్‌లో రాత్రి 10 గంటలకు మొదలయ్యే కోలాహలం మళ్లీ తెల్లవారుజామున సహర్‌ ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. పోలీస్‌ ఉన్నతాధికారులు మహిళల రక్షణ కోసం ఈవ్‌టీజర్స్‌ నుంచి కాపాడేందుకు షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి.

– మహ్మద్‌ అల్తాఫ్‌,

మండిబజార్‌, వరంగల్‌

మండి బజార్‌ నైట్‌ వ్యూ

రంగల్‌ నగరంలోని మండిబాజార్‌ నిత్యం రద్దీగానే ఉంటుంది. రంజాన్‌ మాసం వేళ ఇక్కడి దుకాణాలు విద్యుత్‌ దీపాలతో తళతళలాడుతుంటాయి. ముత్యాలు, రాళ్లతో పొదిగిన గాజులు, మేకప్‌ సామగ్రి కొనుగోలు చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. సంప్రదాయ ఖారా దుపట్టా, జరీవర్క్‌ ఉన్న దుస్తులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లల కోసం బొమ్మలు, ఈద్‌కు సంబంధించిన పఠానీ, షల్వార్‌ ఖమీస్‌, షెల్వార్‌ షూట్‌ కొత్త దుస్తుల కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. అత్తరు వాసన(రోజ్‌, మొగ్రా) ఘుమఘుమలు, చేనేత కళాఖండాలు, కొత్తరకం బెడ్‌ షీట్లు, పరదాలు, క్రాకరీ ఐటమ్స్‌ పాదరక్షలు తదితరాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ఇక్కడ కొనుగోళ్లు చేస్తూ ఉంటారు.

నోరూరించే ఘుమఘుమలు..

మండిబజార్‌ అంటే కేవలం షాపింగ్‌ మాత్రమే కాదు.. హలీం, హరీస్‌, పత్తర్‌కా ఘోష్ట్‌, కబాబ్‌, సమోసా, జిలేబీ, షీర్‌ ఖుర్మా, కద్దూకా ఖీర్‌, డబుల్‌కా మీఠా, ఖుర్బానీకా మీఠా, షాయిదూద్‌ వంటి పదార్థాలు నోరూరిస్తాయి. సహరీ సమయం వరకు ఇరానీ చాయ్‌–ఉస్మానియా బిస్కెట్లను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. సాధారణంగా నగరమంతా నిద్రపోయే సమయంలో ఈ ప్రాంతం మేల్కొని ఉంటుంది. రంజాన్‌లో ఉపవాసాలు ఉండే వారికి నైట్‌బజార్‌లో షాపింగ్‌ అయ్యాక తెల్ల వారుజామున 3 గంటల నుంచి 4.30 మధ్య సహరీ (సూర్యోదయానికి ముందు సమయం) సందడి మొదలవుతుంది. కేవలం ఇఫ్తార్‌కే కాకుండా సహరీ కోసం ప్రత్యేకంగా ఖిచిడీ–ఖట్టా–ఖీమా, నహారీ–కుల్చా తదితర వంటకాలు ఇక్కడ హాట్‌ కేక్‌ల్లా అమ్ముడవుతాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పర్యాటకులే కాకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఇక్కడి వచ్చి తెల్ల వారుజామున ఈ విందును ఆస్వాదిస్తారు.

భద్రత కట్టుదిట్టం..

వేలాది మంది తరలి వచ్చే ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నగర పోలీసు అధికారులు ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వేలాది వాహనాలను నియంత్రించడానికి ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేసి నియంత్రిస్తున్నారు. కంట్రోల్‌ రూం ద్వారా నిరంతర నిఘా పెడుతున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్‌ బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement