అదనపు కలెక్టర్ రవి
కమలాపూర్: జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ ఎన్.రవి కోరారు. కమలాపూర్లోని హెచ్పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ప్లాంట్ రికార్డులు పరిశీలించి గ్యాస్ బాట్లింగ్, సిలిండర్ల సరఫరా తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ సంక్షోభంలో ప్రజలు గ్యాస్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తిస్థాయి గ్యాస్ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. కమలాపూర్లోని గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్కు గతంలో మాదిరిగానే రోజుకు 15 లోడ్ల గ్యాస్ ట్యాంకర్లు వస్తున్నాయని, ఇక్కడి నుంచి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం పాత జిల్లాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గతంలో సగటున 3 వేల సిలిండర్ల బుకింగ్ ఉండగా.. ఇప్పుడు 15 వేల వరకు సిలిండర్లు బుకింగ్ చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆస్పత్రులు, స్కూల్స్, విద్యా సంస్థలకు నిత్యం గ్యాస్ సరఫరా చేస్తున్నామని, హోటల్స్కు మాత్రమే సరఫరా నిలిపివేశామన్నారు. గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని వినియోగదారులు నమ్మవద్దని కోరారు. అంతకుముందు ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. కిచెన్షెడ్డు, భోజనాన్ని పరిశీలించారు. వంటల గురించి అడిగి తెలుసుకుని, వంటగ్యాస్ నిల్వల గురించి ఆరా తీశారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్, జిల్లా మేనేజర్ మహేందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సదానందం, ఆర్ఐ సమ్మయ్య, హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ నిర్వాహకులున్నారు.


