శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
నేటినుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
● ఉదయం 9.35 గంటలు దాటితే నో ఎంట్రీ
● అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు
● తొలిసారిగా సెంటర్ల వద్ద క్లాక్ రూమ్
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో సంబంధిత విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం నుంచి ఏప్రిల్ 15వరకు జరగనున్న పరీక్షలకు హనుమకొండ జిల్లాలో 64 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ కలిపి 12,079 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్కో సెంటర్కు ఒకరు చొప్పున 64మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారిగా క్లాక్రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు తీసుకురాకూడదు. ఒకవేళ ఏమైనా బ్యాగ్లు తీసుకొస్తే ఆ క్లాక్ రూమ్లో భద్రపర్చుకునే వెసులుబాటు కల్పించారు.
హాల్టికెట్పై క్యూఆర్ కోడ్
విద్యార్థులకు హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఆ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్షకేంద్రం అడ్రస్ గూగుల్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది. ఇప్పటికే హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైనా ఫీజుల పేర హాల్టికెట్ ఇవ్వకుంటే నేరుగా బీఎస్ఈ.తెలంగాణజీఓవీ.ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ హాల్టికెట్తో పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉంటుంది. కేంద్రాల్లోని సీఎస్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లకూ ఫోన్ అనుమతి లేదు. సీసీ కె మెరాల నిఘాలోనే చీఫ్ సూపరింటెండెంట్ ప్రశ్నపత్రాల బండిళ్లను విప్పాల్సి ఉంటుంది.
పరీక్షలు ముగిశాక మళ్లీ సీసీ కెమెరా నిఘాలోనే జవాబుపత్రాలను బండిళ్లుగా కట్టాల్సి ఉంటుంది.
ప్రతీ పరీక్షకు వ్యవధి..
శనివారంనుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పరీక్షల్లో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు బాగా ప్రిపేరయ్యే అవకాశం ఉంది. మధ్య లభించే ఈ గడువులో వారికి సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలు, అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం..
టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9–35గంటల తర్వాత అనుమతి ఉండబోదు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాం. ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.
– ఎల్వీ గిరిరాజ్ గౌడ్, డీఈఓ హనుమకొండ
●
పరీక్షసమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు
ఫిజికల్, బయాలాజికల్ సైన్స్ : ఉదయం 9–30 నుంచి 11గంటల వరకు
కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు.
కేంద్రాల సమీపంలోని జిరాక్స్సెంటర్లను మూసివేయాల్సి ఉంటుంది.
కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడుపుతారు.
విద్యుత్కు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షల విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ (సెల్నంబర్ 79817 67208)లో సంప్రదించవచ్చు.
విద్యార్థులు గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సింటుంది.
ఉదయం 9–35గంటల తర్వాత లోనికి అనుమతి ఉండదు.
సమాచారం కోసం ప్రతీ సెంటర్ వద్ద బ్యానర్ కట్టారు. అందులో సెంటర్ పేరు, కంట్రోల్ రూమ్ సెల్నంబర్ను పొందుపర్చారు.


