దుగ్గొండి: కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతర రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకు వేదికగా మారింది. జాతర జరిగేది గీసుగొండ మండలం కొమ్మాలలో అయినా బండ్లు తిరిగే రోజు మాత్రం నర్సంపేట నియోజకవర్గానిదే పైచేయిగా వస్తోంది. దశాబ్దాల కాలం నుంచి దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా బండ్లు తరలివెళ్తుంటాయి. ఇక్కడ ఒకరికంటే ఒకరు ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన బండ్లను తయారు చేసి జాతరకు తరలించి పైచేయి సాధిస్తుంటారు. ఇదేక్రమంలో ఈసారి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఆధ్వర్యంలో ఆధునికతతో భారీ ప్రభబండి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఫీట్ల భారీ ప్రభను అధునాతన హంగులతో గిర్నిబావిలోని ఓ వెల్డింగ్ షాపులో అల్లం బాలకిశోర్ రెడ్డి, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజుకుమార్ దగ్గరుండి తయారు చేయిస్తున్నారు. ప్రభను పైకి కిందికి లేపడానికి హైడ్రాలిక్ జాకీలు కూడా ఏర్పాటు చేశారు. ఇలా రూపుదిద్దుకుంటున్న ప్రభను మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.


