మెరుగైన వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలందించాలి

Jan 23 2026 9:08 AM | Updated on Jan 23 2026 9:08 AM

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

కమలాపూర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ వైద్య సిబ్బందికి సూచించారు. ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ నమోదు, ల్యాబ్‌, ఐపీ వార్డు, ఇతర విభాగాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఎంతమంది వైద్యులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు, వారు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యాధికారి పద్మశ్రీని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌లో ఏ పరీక్షలు చేస్తున్నారని ల్యాబ్‌ టెక్నీషియన్‌ సురేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓపీ సేవలు, గర్భిణులకు అందించే వైద్య సేవలు, కుక్కకాటుకు సంబంధించిన కేసుల రికార్డులు తనిఖీ చేశారు. గర్భిణులకు ఏ పరీక్షలు చేస్తున్నారు, పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారా, టీబీ నియంత్రణకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఫార్మసీలో మందులు అందుబాటులో ఉన్నాయా, ల్యాబ్‌ పరీక్షలు తక్కువగా ఉన్నాయా అని కలెక్టర్‌ ఆరా తీశారు. ఇటీవల ల్యాబ్‌ టెక్నీషియన్‌ను కేటాయించడంతో అవసరమైన వారికి పరీక్షలు చేస్తున్నామని వైద్యాధికారి కలెక్టర్‌కు వివరించారు. రోగులకు అవసరమైన మేరకు టెస్టులు నిర్వహించాలని సూచించారు. అనంతరం వైద్య సేవల కోసం వచ్చిన స్థానికులతో కలెక్టర్‌ మాట్లాడారు. అవసరం మేరకు ఇన్సులిన్‌ ఇవ్వాలని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్సులిన్‌ కొరత లేదని, షుగర్‌ పేషంట్లకు సరిపడా ఇన్సులిన్‌ ఇస్తున్నామని వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గుండె బాబు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి

హన్మకొండ అర్బన్‌: కిశోర బాలికలు, బాలుర కోసం జిల్లాలో చేపట్టిన ‘స్నేహ’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ స్నేహ శబ రీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఓ, సెర్ప్‌, ఇందిరా మహిళాశక్తి మిషన్‌లో భాగంగా స్నేహ కార్యక్రమం గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. 15–18 సంవత్సరాల వయస్సున్న కిశోర బాలబాలికలకు కౌన్సెలింగ్‌తో పాటు వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ స్నేహ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ గిరిరాజ్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్‌ అధికారి నరసింహస్వామి, డీఐఈఓ గోపాల్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్‌, మెప్మా డీఎంసీ రజితారాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు మదన్మోహన్‌రావు, ప్రదీప్‌రెడ్డి, డీఆర్డీఏ డీపీఎం పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.

పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని, స్లిప్‌ టెస్టులు నిర్వహించి వారి అభ్యసన స్థాయిని మెరుగుపరచాలని ఆదేశించారు. డీఈఓ గిరిరాజ్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ భువనేశ్వరి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, జీసీడీఓ సునీత, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌, ఏఎస్సీ రఘుచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ఉప్పల్‌ పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement