వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై పోలీస్ బాస్ సీరియస్ అయినట్లు సమాచారం. భూ కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కుల జాబితాను తనకు పంపించాలని సోమవారం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల పలు పొలీస్స్టేషన్లలో సంబంధిత అధికారులు భూముల పంచాయితీల వైపు మొగ్గు చూపడం వివాదంగా మారింది. ఆ కేసులు సీపీ అంబర్ కిషోర్ ఝా దృష్టికి రావడంతో స్టేషన్ల వారీగా పెండింగ్ భూ పంచాయితీల కేసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. నగరంలోని కొన్ని పోలీస్స్టేషన్లలో ఇటీవల భూ కబ్జాదారులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వారి వివరాలను నివేదిక రూపంలో సీపీ పంపించినట్లు తెలిసింది. పేదల భూములను ఆక్రమిస్తున్న వారిపై రౌడీ షీట్తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
పేపర్లెస్ వర్క్ కోసం ‘ఈ–ఆఫీస్’
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్లోని వివిధ కార్యాలయాల్లో పేపర్ రహితంగా కార్యక్రమాలు చేపట్టేందుకు పేపర్ లెస్ వర్క్స్కు ఈ–ఆఫీస్ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్లోని బోస్ హాల్లో ఈ–ఆఫీస్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారత ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ రేయిల్ టెల్ కార్పొరేషన్ సౌజన్యంతో సేవలందిస్తుందని తెలిపారు. ఈ–ఆఫీస్తో నిట్లోని కార్యక్రమాలు పారదర్శకంగా, వేగవంతంగా, ఖర్చు తగ్గిస్తూ, సరైన సమయంలో అందజేయడంతో పాటు పేపర్ రహితంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎన్వీ.ఉమామహేశ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సెంటర్ హెడ్, ప్రొఫెసర్ రష్మీ రంజన్ రౌత్, రేయిల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాయింట్ జనరల్ మేనేజర్ విక్రాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ‘లా’ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఐదేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు. ఈనెల 16, 18, 20, 22 తేదీల్లో ఆయా పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని వారు తెలిపారు. ఈనెల 16 నుంచి ఐదేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16, 18, 20, 22, 24 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.