‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం’
ఆత్మకూర్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సలీం ఆరోపించారు. ఆదివారం పట్టణంలో కార్మిక సంఘం రెండో మహాసభలు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. మహాసభలకు ఆయనతో పాటు సీపీఐ మాస్లైన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న, రాష్ట్ర నాయకుడు అరుణ్కుమార్, రాజు, చింతలన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. దేశంలో ధనవంతులే కుభేరులుగా మారుతున్నారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ దాసోహం అంటోందన్నారు. కార్మికులు, పేదలను విస్మరిస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అలాగే ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని, ప్రతి వారం కూలి డబ్బులు చెల్లించాలని, రోజుకు రూ.700 ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


