పుర ఫలితాలు పునరావృతం కావాలి
కొత్తకోట: పుర ఎన్నికల ఫలితాలే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని.. రాష్ట్రంలో మరోసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం పుర చైర్పర్సన్గా పి.అరుణ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్గా పి.పల్లవి కృష్ణారెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు స్థానిక అంబాభవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా పుర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం ఎమ్మెల్యే వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అభినందన, సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి కట్టారని.. పుర పాలకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేసి వారి మన్ననలు పొందాలని కోరారు. అనంతరం 9వ వార్డులో నీటి మోటారును ప్రారంభించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
మదనాపురం: మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆర్థిక సాయం అందిస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, కో–ఆర్డినేటర్ మహేష్ పాల్గొన్నారు.


