తగ్గుతున్న పశుసంపద
● ఏటా గణనీయంగా పడిపోతున్న పశువుల సంఖ్య
● యాంత్రీకరణ, మేత కొరతతో
కుదేలవుతున్న రైతులు
యాంత్రీకరణతో పశువుల సంఖ్య తగ్గుతోంది. కాగా పాడి పరిశ్రమ వైపు రైతులను ప్రోత్సహించేందుకు సంకరజాతి పశువుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నాం. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేస్తున్నాం. పాడి రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్రెడ్డి,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
మదనాపురం: ఒకప్పుడు పొలాల్లో గంటల సవ్వడితో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు నిశ్శబ్ధంఆవరిస్తోంది. రైతన్నకు వెన్నముకగా నిలిచిన పశుసంపద ఏటా క్షీణిస్తోంది. పాడిని నమ్ముకొని బతికే కుటుంబాలు క్రమంగా ఇతర జీవనోపాధిని వెదుక్కొంటున్నాయి. జిల్లాలో 2019 నాటి పశుగణన లెక్కలు.. ప్రస్తుత అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎద్దులు, దేశీయ ఆవుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
ఇవే ప్రధాన కారణాలు..
పంటల సాగులో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో ఎద్దుల అవసరం లేకుండా పోయింది. సాగు విస్తీర్ణం పెరిగినా పశుగ్రాసం పెంచే ఆసక్తి తగ్గింది. అడవుల్లోనూ మేతకు అనుమతి లేకపోవడం కారణంగా చెప్పవచ్చు. అలాగే మార్కెట్లో పశుగ్రాసం, దాణా ధరలు భారీగా పెరిగాయి. ఆ స్థాయిలో పాలధర పెరగకపోవడంతో పాడి రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నేటితరం యువత పశువుల పెంపకాన్ని కష్టతరంగా భావించి పట్టణాల బాట పడుతున్నారు. గాలికుంటు, చర్మవ్యాధులు సోకడం, సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయి.
మండలాల వారీగా పశువుల సంఖ్య (సుమారుగా..)
వనపర్తి 12,700, గోపాల్పేట 10,300, పెబ్బేరు 14,300, కొత్తకోట 11,900, పెద్దమందడి 8,600, ఖిల్లా ఘనపురం్ 7,800, పాన్గల్ 11,800, శ్రీరంగాపురం 6,600, వీపనగండ్ల 10,700, చిన్నంబావి 8,300, ఖిల్లాఘనపురం 10,000, మదనాపురం 7,300, ఆత్మకూరు 11,300, అమరచింత 7,400


