త్వరలోనే బీచుపల్లి ఆయిల్ మిల్లు ప్రారంభం
ఎర్రవల్లి: జిల్లాలో ఆయిల్పాం తోటలు సాగు చేసిన రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని త్వరలోనే బీచుపల్లి ఆయిల్ మిల్లు ప్రారంభమవుతుందని తెలంగాణ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్, సివిల్, నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయిల్ మిల్లులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీచుపల్లిలో నూతన ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. బీచుపల్లిలో ఆయిల్మిల్లు 95.20 ఎకరాల్లో ఉందని అందులో రూ.47 కోట్ల వ్యయంతో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈటీపీ వంటి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్, సివిల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల మిల్లులో ఉన్న 11 భవనాలకు ఎన్డీటీ బృందం నాణ్యతా ప్రమాణ పరీక్షలను నిర్వహించి కేవలం రిఫైనరీ ఒకటి మాత్రమే నాణ్యత లేదని నిర్ధారించిందన్నారు. అలాగే రైతు సేవా కేంద్రం నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులకు ఆయిల్పాం పంటలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయిల్పాం పంటలకు అవసరమైన డ్రిప్, ఎరువులు, హార్వెస్టింగ్, పరికరాలు కూడా త్వరలోనే ఆయిల్ మిల్లులో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.


