సమర్థవంతంగా క్షయ నిర్మూలన
వనపర్తి: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి రోగికి అవసరమైన సలహాలు, పోషకాహారం, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని క్షయ నిర్ధారణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి నిత్యం ఎంతమంది రోగులు వస్తున్నారు.. అందిస్తున్న వైద్యసేవలు, పరీక్షలు, మందుల పంపిణీ తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగుల నమోదు, చికిత్స, పర్యవేక్షణ సక్రమంగా చేపట్టాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ పరీక్షలు విస్తృతం చేయాలని సూచించారు. ప్రజలు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
వైద్య శిబిరం సందర్శన..
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా జిల్లాకేంద్రంలో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం శిబిరాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం సరికాదని.. అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు రెఫర్ చేసే చర్యలు వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్య నిపుణుడు సుమన్ వ్యాస్ నేతృత్వంలో 62 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 18 మంది చిన్నారులను శస్త్రచికిత్స నిమిత్తం రెఫర్ చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్రెడ్డి, ప్రోగ్రాం అధికారి పరిమళ, ఇతర అధికారులు ఉన్నారు.


