నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్
వనపర్తిలో సరికొత్త రికార్డు..
మెజార్టీ సమస్య లేకుండా ఎక్స్ అఫీషియో ఓట్లు..
● వనపర్తిలో తొలిసారిగా ఓసీ చైర్పర్సన్
● అమరచింతలో మంత్రి వాకిటి శ్రీహరి,
పెబ్బేరులో ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఎక్స్ అఫీషియో ఓట్లు
● మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ల
ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు
వనపర్తి: ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేసి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకున్నారు. హంగ్ ఏర్పడిన అమరచింత పుర పీఠాన్ని సైతం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణను తమవైపునకు తిప్పుకొని అనూహ్యంగా ఆమెకే చైర్పర్సన్ పదవి కట్టబెట్టి.. అమరచింత మున్సిపాలిటీని కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ చైర్పర్సన్ పదవి కోసం పార్టీ మారడంపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం తీవ్రంగా స్పందించారు. అధికార దాహంతో ఇతర పార్టీ కౌన్సిలర్లను కాంగ్రెస్లో కలుపుకోవడం ఏమిటని విమర్శించారు. కాగా, మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ ఉండటంతో అత్మకూరు మినహా వనపర్తి, పెబ్బేరు, కొత్తకోటలో ముందస్తుగా ప్రచారం సాగిన వారే మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్గా జుబేదాబేగానికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆశీస్సులతో చైర్పర్సన్ పదవి నాగమణిని వరించింది. వైస్ చైర్పర్సన్గా గతంలో ప్రకటించిన నల్లగొండ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకోగా.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పాగా
జిల్లాకేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీని నాలుగు దశాబ్దాలుగా బీసీ చైర్పర్సన్లే పాలించారు. తొలిసారిగా ఓసీ మహిళ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. మొత్తం 22 మంది కౌన్సిలర్లు అధికార పార్టీకి చెందిన వారు ఉండగా.. వారిలో ఒకే ఒక ఓసీ కౌన్సిలర్ ఉన్నారు. ఆమెనే చైర్పర్సన్ పదవి వరించింది. మున్సిపల్ రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి ఆర్యవైశ్యులు తమ కమ్యూనిటీకి చెందిన వారికే మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇవ్వాలని చేసిన డిమాండ్ ఫలించింది.
హంగ్ ఏర్పడిన అమరచింతలో బీఆర్ఎస్ కౌన్సిలర్ను అధికార కాంగ్రెస్ పార్టీవైపు తిప్పుకోవడంతో పాటు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తన ఎక్స్ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకున్నారు. పెబ్బేరులో చైర్మన్ పదవికి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెజార్టీ సమస్య ఉత్పన్నం కావొద్దని ఎమ్మెల్యే మేఘారెడ్డి ముందుజాగ్రత్తగా ఎక్స్ అఫీషియో ఓటు అక్కడే వినియోగించుకున్నారు. తద్వారా బీఆర్ఎస్ ఎత్తులకు చెక్ పెట్టి.. పెబ్బేరు మున్సిపాలిటీని చేజిక్కించుకున్నారు.


