● ఘనంగా స్వాగతం పలుకుదాం రండి
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీ య అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం మీదుగా శ్రీకాకుళం వెళ్తారని తెలిపారు. రాజపులోవ కూడలి నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రారంభం కందివలస గెడ్డ వరకు పార్టీ అధినేతకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఆయా నియోజక వర్గాల పార్టీ నాయకులు ముందుగా ఎంపిక చేసుకున్న సమీకరణ ప్రదేశాల నుంచి తరలిరావాలని సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎస్ఈసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమకు కేటాయించిన ప్రాంతాలకు నిర్ణీత సమయానికి హాజరై, అధినేత వైఎస్ జగన్కు ఘనంగా స్వాగతం పలికి, అయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీటీసీ
డెంకాడ: చొల్లంగిపేట ఎంపీటీసీ సభ్యుడు గుడివాడ కిరణ్కుమార్, మరో 40 మంది యువకులు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. అలాగే, బంటుపల్లి పంచాయతీలోని గొంపవానిపేటకు చెందిన పది కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
మోదీ పర్యటనను
విజయవంతం చేయాలి
విజయనగరం: వచ్చేనెల 1న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డాక్టర్ పి.సంపత్ కుమార్ ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ సమావేశ మందిరంలో కమిషనర్లతో మంగళవారం సమావేశమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


