● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరం లీగల్:
రాజీయే రాజమార్గమని, కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాకుండా ఉంటుందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కోర్టులైన విజయనగరం పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 10,395 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వీటిలో సివిల్ కేసులు 348, క్రిమినల్ కేసులు 10047, ప్రీ లిటిగేషన్ కేసులు 21 పరిష్కరించినట్టు పేర్కొన్నారు. ఇన్సురెన్స్ కంపెనీకి చెందిన రూ.68 లక్షలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్ అదాలత్కు హాజరైన కక్షిదారులందరికీ ప్రముఖ న్యాయవాది పీఏఎన్ రాజు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్లో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి ఎన్.పద్మావతి, మహిళా, ఐదవ జిల్లా న్యాయ మూర్తి కె.నాగమణి, పోక్సో న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ వారు కోర్ట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.


