ప్రమాదాలకు కారణాలను అన్వేషించాలి
● ప్రమాదాల బ్లాక్ స్పాట్స్ను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టండి
● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
డెంకాడ: రహదారి భద్రతలో భాగంగా జాతీయ రహదారి 16పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. డెంకాడ పోలీస్స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ను ఆయన శనివారం పరిశీలించారు. ప్రమాదాల నియంత్రణకు సెంట్రల్ రెయిలింగు, సైన్ బోర్డులు, లైటింగ్, జిగ్ జాగ్ స్టాపర్లు, సర్వీసు రోడ్లపై స్పీడు బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద డ్రోన్ సహాయంతో ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న గ్రామాల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ఆయా ప్రాంతాల్లో సెంటర్ డివైడర్పై రైలింగ్ వేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు కొన్ని ప్రాంతాల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా, జాతీయ రహదారి, సర్వీసు రోడ్లు కనెక్ట్ అయ్యే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు జిగ్ జాగ్ స్టాపర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల నంబర్లను గుర్తించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టోల్ ప్లాజా అధికారులకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనారు.


