
సీఆర్టీల ఆందోళన
కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి
నిరసన తెలుపుతున్న సీఆర్టీలు
● హైకోర్టు ఉత్తర్వులు అమలు
చేయాలని డిమాండ్
పార్వతీపురం రూరల్: సీఆర్టీలు ఆందోళన బాటపట్టారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏడాదిలో 11 నెలలు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. ఐటీడీఏ అధికారుల నిర్వాకం వల్ల ఉద్యోగాలకు భద్రత కరువైందని ఆరోపించారు. డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయని, కొత్తవారికి పోస్టులు కేటాయిస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సుమారు 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయాలంటూ యూటీఎఫ్, సీఆర్టీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పోరుబాటకు పూనుకున్నారు.