బోల్తా పడిన లారీ | - | Sakshi
Sakshi News home page

బోల్తా పడిన లారీ

Aug 21 2025 6:38 AM | Updated on Aug 21 2025 7:24 AM

బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామం వద్ద జాతీయ రహదారి 26పై మానాపురం నుంచి విజయనగరం వస్తున్న లారీ అదుపుతప్పి పంట పొలాల్లో బుధవారం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు.

15 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్‌

కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధి జి.శివడ పంచాయతీ పెద్దఅంటిజోల గ్రామసమీపంలో అక్రమంగా సారా విక్రయిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు బుధవారం నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల సారాను ఓ వ్యక్తి కలిగి ఉండడంతో సారా స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా వంటకాలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విజృంభిస్తున్న జ్వరాలు

మంచం పడుతున్న ప్రజలు

సాలూరు: వర్షాలు తెరిపిచ్చిన క్రమంలో నియోజకవర్గంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వైరల్‌, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గిరిశిఖర దొర్లతాడివలస, జాకరవలస, మూలతాడివలస, కుంబిమడ తదితర గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. తీవ్రజ్వరాలతో బాధపడుతున్నా మెడికల్‌ క్యాంపులు నిర్వహించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న దొర్లతాడివలసకు చెందిన మధుసూదనరావును విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో సుమారు ఏడాది కాలానికి పైగా ఏసీఎం ద్రావణం పిచికారీ చేయలేదని గిరిజనులు అంటున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో దోమలు అధికమయ్యాయని, ఫలితంగా జ్వరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలతో వైద్యశిబిరం ఏర్పాటు

గిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ స్పందించి వెంటనే వైద్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేయడంతో దొర్లతాడివలసలో బుధవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దొర్లతాడివలస, జాకరవలసకు చెందిన 44 మందికి వైద్యపరీక్షలు చేసి మెరుగైన చికిత్స నిమిత్తం పలువురిని తోణాం పీహెచ్‌సీకి తరలించారు.

నూతనబార్‌ పాలసీ

విధానంలో ఫీజుల తగ్గింపు

విజయనగరం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్‌ పాలసీ విధానంలో లైసెన్స్‌ ఫీజులు భారీగా తగ్గించినట్లు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత బార్‌ పాలసీ విధానంతో పోల్చితే లైసెన్స్‌ దారుడికి అనేక రాయితీలు లభిస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తు విధానంతో పాటు ఒక వ్యక్తికి ఒకటికి మించి బార్లు కేటాయింపు, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకూ బార్‌ పనివేళలు ఉంటాయన్నారు. ఆరు వాయిదాల్లో లైసెన్స్‌ పీజు చెల్లింపు చేసుకోవచ్చని, ఐఎమ్‌ఎల్‌, బీర్‌ అమ్మకాలు జరిగిన తదుపరి రెండు నెలల తర్వాత చెల్లింపులు చేయవచ్చన్నారు.

సాయికిరణ్‌కు కన్నీటి వీడ్కోలు

సంతకవిటి: మండలంలోని శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయికిరణ్‌(20) మంగళవారం కాకినాడలో నిర్వహించిన అగ్నిపథ్‌ (ఆర్మీ) ర్యాలీలో 1600 మీటర్ల పరుగుపందెంలో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. సాయికిరణ్‌ మృతదేహం బుధవారం వేకువజామున స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సాయికిరణ్‌ అంతిమయాత్రలో గ్రామస్తులతో పాటు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయికిరణ్‌ మృతదేహంపై ఆర్మీ క్యాప్‌, వస్త్రాన్ని ఉంచారు.

బోల్తా పడిన లారీ1
1/2

బోల్తా పడిన లారీ

బోల్తా పడిన లారీ2
2/2

బోల్తా పడిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement