
హామీల జోరు.. అమలులో బేజారు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి మంత్రులు, నాయకులు హామీలు ఇవ్వడంలో జోరుగా, హుషారుగా ఉంటారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను బేజారు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఏపీఏ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
● జీఓ 3ను పునరుద్ధరిస్తామని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చుతామని, ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ, 5వ షెడ్యూల్డ్, 1/70 కచ్చితంగా అమలు చేస్తామని, కొఠియా గ్రామాలకు పరిష్కారం చూపుతామని, కుడుమూరు భూ వివాదం పరిష్కారం, డోలీ కష్టాలు లేకుండా చూస్తామని చంద్రబాబునాయుడు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి పరిష్కారం ఊసేలేదు. దీనిపై గిరిజనులు ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. ఇది గిరిజనులను మోసం చేయడం కాదా?. అబద్ధాలతో ఎన్నాళ్లు పాలిస్తారని రాజన్నదొర నిలదీశారు.
అబద్ధాలు చెప్పడంతో ఆరితేరిన మంత్రి...
మంత్రి సంధ్యారాణి ప్రజాదర్బార్, పత్రికా సమావేశాలు, స్వాతంత్య్రదినోత్సవ వేదిక, చివరికి చట్టసభలలోనైనా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సాలూరు శ్యామలాంబ పండగ కోసం రూ.2 కోట్ల అప్పుడబ్బులతో చేపట్టాల్సిన పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ, కౌన్సిల్ ఆమోదం తెలపలేదని ప్రజలు, పత్రికాసమావేశాల్లో మంత్రి సంధ్యారాణి అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేసారు. మహిళల ఆత్మగౌరవం కోసం సాలూరులో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు నిధులు తీసుకువస్తానని చెప్పిన మంత్రి ఏడాది గడిచినా పట్టించుకోలేదని, ఆ పనులు జరగలేదని, మరి మహిళల ఆత్మగౌరవ నినాదం ఏమైందని రాజన్నదొర ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి పెట్టిన తొలి సంతకం నేటికీ కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు.
● 2014–19 మద్య టీడీపీ హయాంలో సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉండగా తను ఎమ్మెల్యేగా ఉన్నానని, 2015లో నాటి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సాలూరు నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు ఉపాధిహామీ కింద సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. తరువాత కలెక్టర్గా వచ్చిన వివేక్యాదవ్ తాగునీరు, రోడ్డ పనుల కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఆ నిధులు రాకుండా అడ్డుకున్నారని రాజన్నదొర విమర్శించారు.
● సాలూరులో వందపడకల ఆస్పత్రికి వైఎస్సార్సీపీ అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టీడీపీది అబద్ధాల పాలన
ఏడాదిన్నరగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు
కనిపించని అభివృద్ధి, సంక్షేమం
పథకాల అమలులో కనిపించని చిత్తశుద్ధి
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర