
హెచ్ఐవీ రోగులకు మెరుగైన వైద్యసేవలు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో హెచ్ఐవీ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె. రాణి తెలిపారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల సంస్మరణ దినం సందర్బంగా ఆదివారం రాత్రి స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మీదుగా ఆర్అండ్బీ వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ఐవీ రోగులు ఏఆర్టీ మందులు క్రమంతప్పకుండా వాడి జీవితకాలాన్ని పెంచుకోవాలన్నారు. ప్రజల్లో హెచ్ఐవీ వ్యాధి పట్ల అవగాహన పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్టీ మందులతో జీవిత కాలం పెంచుకోవచ్చు..
పార్వతీపురం టౌన్: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు క్రమంతప్పకుండా ఏఆర్టీ మందులు వాడితే జీవితంకాలం పెంచుకోవచ్చని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎం.వినోద్ అన్నారు. హెచ్ఐవీతో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ, సంఘీభావం తెలియజేద్దాం.. వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేద్దాం’’ అనే నినాదంతో ఆదివారం స్థానిక ఎన్జీఓ హోమ్లో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల సంస్మరణ దినం నిర్వహించారు. ముందుగా మృతులకు అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీడీ 4 కౌంట్ మిషన్ పార్వతీపురం కేంద్రాస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. ఎపిడమియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ రోగులు జాగ్రత్తలు పాటించాలని, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని సూచించారు. జిల్లా పర్యవేక్షకుడు ఎన్. సాక్షి గోపాలరావు మాట్లాడుతూ.. హెచ్ఐవీ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమములో వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, విజయ పాజిటివ్ నెట్వర్క్ సిబ్బంది, పాజిటివ్ నెట్వర్క్, వైడీఓ స్వచ్ఛంద సంస్థ , లింకు వర్కర్లు (చైల్డ్ ఫండ్ఇండియా), వైఆర్జీ కేర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఐవీ రోగులకు మెరుగైన వైద్యసేవలు