మహారాణిపేట: అగ్నివీర్ పథకం కింద సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్కిశోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్మీ నియామక ర్యాలీ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీతోపాటు బీచ్రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఇద్దరు నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ర్యాలీ తేదీలు, అర్హతలు, వేదిక, ఇతర సూచనలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ అమరేష్ సింగ్, ఇన్చార్జి డీఆర్వో టి. గోవిందు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.


