మద్దిలపాలెం: ప్రభుత్వం వహిస్తున్న ఉదాసీన వైఖరి వల్ల రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక అభద్రతకు లోనవుతున్నారని ఉద్యోగ వేదిక రాష్ట్ర చైర్మన్, ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.అస్కారరావు విమర్శించారు. కేఆర్ఎం కాలనీలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, లేదా నేరుగా 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేతన స్థిరీకరణ, పెండింగ్ డీఏల విడుదల, దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్ములకు భద్రతతో పాటు పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్ను అనుమతించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నెపంతో పదోన్నతులు, బదిలీలను నిలిపివేసి ఉద్యోగులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఆర్థికేతర సమస్యలపై అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. త్వరలోనే ఉద్యమ దశలను సిద్ధం చేసి కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణ, కోశాధికారి కె. శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


