మెగా పీటీఎంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
సింహాచలం: విశాఖకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడ చదివే విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. అడవివరం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్(పీటీఎం) 4.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఏడాది పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, డ్రోన్ నమూనాను పరిశీలించి, అసలైన డ్రోన్ను పాఠశాలకు తీసుకువచ్చి ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. కొరియన్ భాషపై ఆసక్తి వ్యక్తం చేసిన విద్యార్థినిని అభినందించి, విదేశీ భాషల బోధనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్తమాతో బాధపడుతున్న ఓ విద్యార్థిని వైద్య పరీక్షల కోసం డీఎంహెచ్వోకు రిఫర్ చేశారు. పదో తరగతి ఫలితాల్లో 88 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.


