పెన్షన్ చెల్లింపులా?
స్టీల్ ప్లాంట్లో
వితంతు కుటుంబాల వేదన
ఈఎఫ్బీఎస్ కింద
380 శాతం వరకు బకాయిలు
ఆర్థికంగా కుదేలవుతున్న
600 కుటుంబాలు
ఉత్పత్తి ఆధారంగా
ఉక్కునగరం : ఒకప్పుడు నెలకు రూ.91 వేల చొప్పున స్థిరంగా వచ్చేది. పిల్లల చదువులు, ఇళ్ల ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు అన్నీ ఆ మొత్తంపైనే ఆధారపడి సాగేవి. కానీ ఇప్పుడు ప్రతి నెలా ఎంత వస్తుందో తెలియని పరిస్థితి. కొన్నిసార్లు 50 శాతం, మరికొన్ని సార్లు 30 శాతంం ఇలా ‘పర్సంటేజీ’ చెల్లింపులతో వితంతు కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. 2019లో స్టీల్ప్లాంట్లో క్యూఎటీడి విభాగంలో మేనేజర్గా పనిచేసిన ఉద్యోగి మరణించడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. సహోద్యోగుల సూచనతో ఎంప్లాయిస్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఈఎఫ్బీఎస్)లో భాగంగా పీఎఫ్, గ్రాట్యుటీతో పాటు అదనంగా రూ.31 లక్షలు జమ చేశారు. ఉద్యోగి సర్వీసు కాలం వరకు ప్రతి నెలా చివరి బేసిక్, డీఎ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పులు చేసి మరీ ఆ మొత్తం చెల్లించిన కుటుంబం, ఆపై వచ్చిన నెలవారీ చెల్లింపులతో జీవనం కొనసాగించింది. అయితే 2023 నుంచి పరిస్థితి మారింది. ఉద్యోగులకు జీతాలు శాతం వారీగా చెల్లించినట్లే, ఈఎఫ్బీఎస్ లబ్ధిదారులకూ ‘పర్సంటేజీ’ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు సుమారు 380 శాతం వరకు బకాయిలు పేరుకుపోయాయని కుటుంబాలు వాపోతున్నాయి.
శాతం వారీగా చెల్లింపులా?
ఉద్యోగుల వేతనాలు ఉత్పత్తి ఆధారంగా శాతం వారీగా చెల్లిస్తున్న పరిస్థితి తెలిసిందే. అదే విధానాన్ని వితంతు కుటుంబాలపై కూడా అమలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నాలుగు నెలల వితంతు పెన్షన్ బకాయి పెట్టడమే కాకుండా, చెల్లింపులను శాతం వారీగా ఇవ్వడం దుర్మార్గమని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై బాధితులు విశాఖ ఎంపీ శ్రీభరత్ను కలిసి తమ గోడును వినిపించారు.
కుటుంబాల ఆవేదన
పిల్లల చదువులు, ఇళ్ల ఈఎంఐలు, పెళ్లిళ్లు వంటివి ఈ నెలవారీ చెల్లింపులపైనే ఆధారపడి ఉన్నాయి. చెల్లింపులు సక్రమంగా రాకపోవడంతో వడ్డీలు, అప్పులు పెరుగుతున్నాయి. భర్తను కోల్పోయిన మానసిక వేదనతో పాటు ఆర్థిక భారం కూడా భరించాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. వితంతు కుటుంబాల హక్కులపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, పూర్తి చెల్లింపులు సకాలంలో అందించాలని వారు యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.
చాలా ఇబ్బందులకు
గురిచేస్తున్నారు
భర్తను కోల్పోయి పిల్లలతో జీవనం సాగిస్తున్న మాకు ప్రతి నెలా ఎంత వస్తుందో తెలియని పరిస్థితి. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇలా చేయవు. ప్రభుత్వ రంగ సంస్థ ఇలా వ్యవహరించడం బాధాకరం.
– స్టీల్ప్లాంట్ ఉద్యోగి భార్య
ఈఎఫ్బీఎస్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
స్టీల్ప్లాంట్ ఉద్యోగుల కోసం రూపొందించిన ఈ పథకం రెండు కేటగిరీల్లో అమలవుతోంది.
1) విధి నిర్వహణలో మృతి
ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే పీఎఫ్, గ్రాట్యుటీ పూర్తి చెల్లింపు
కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం
ఉద్యోగి సర్వీసు కాలం పూర్తయ్యే వరకు బేసిక్, డీఎ చెల్లింపు
ఈ విభాగంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి.
2) సహజ మరణం /ప్రమాదం/
మెడికల్ అన్ఫిట్
ఉద్యోగి నోషనల్ పీఎఫ్, గ్రాట్యుటీని యాజమాన్యానికి జమ చేస్తే ఉద్యోగి సర్వీసు కాలం పూర్తయ్యే వరకు నెలవారీ బేసిక్, డీఎ చెల్లింపు
కాలం పూర్తయ్యాక జమ చేసిన మొత్తం తిరిగి చెల్లింపు
దాదాపు 600 కుటుంబాలు ఈ కేటగిరీలో ఉన్నాయి.
మొత్తం రూ.200 కోట్లకు పైగా యాజ మాన్యానికి జమ చేసినట్లు సమాచారం.


